ఢిల్లీ మంత్రుల శాఖలు ఇవే!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం హస్తిన పీఠం ఎక్కిన అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కేబినెట్‌లోని ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. తాను మాత్రం ఎటువంటి శాఖ తీసుకోలేదని సమాచారం. గత మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక భూమిక​ పోషించిన మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్, కైలాస్‌ గహ్లోత్, గోపాల్‌ రాయ్, రాజేంద్ర పాల్‌ గౌతమ్, ఇమ్రాన్‌ హుస్సేన్‌లకు మళ్లీ కేబినెట్‌ పదవులు దక్కాయి. గత కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీశ్‌ సిసోడియా.. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి ఆయనకు ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాల శాఖ కేటాయించినట్టు ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది.